పెళ్లయినా భర్తకు దూరంగా వుంటున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ జల్సాల కోసం గంజాయి దందా చేపట్టింది. అయితే వీరి పాపం పండి తాజాగా పోలీసులకు పట్టుబడ్డారు.
విజయవాడ: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా నిర్వహిస్తున్న ఓ మహిళ పోలీసులకు పట్టుబడింది. ఇటీవల సదరు బ్యూటిషియన్ ప్రియుడు అరెస్ట్ కాగా అనుమానంతో ఈమె ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో మహిళ గంజాయి దందా బయటపడింది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన హలీమున్నీసా బేగంకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విబేదాల కారణంగా విడిపోయి వేరుగా కాపురం వుంటోంది. ఈ క్రమంలోనే సాదిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ సహజీవనం ప్రారంభించారు. సాదిక్ గంజాయి దందా చేయగా హలీమున్నిసా కూడా బ్యూటీ పార్లర్ ముసుగులో అతడికి సహకరించేంది. ఇలా ఇద్దరూ కలిసి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో చట్టవిరుద్దంగా గంజాయి అమ్మకాలు చేపడుతున్నారు.
Video
అయితే ఇటీవల సాదిక్ గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుండి గంజాయిని స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే అతడి ప్రియురాలు హలీమున్నిసా నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 550 గ్రాముల గంజాయి పోలీసుల తనిఖీలో బయటపడింది. దీంతో ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు హలీమున్నిసాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
ఇదిలావుంటే ఇటీవల కాలంలో ఏపీ పోలీసులు గంజాయి సాగు, స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది పోలీస్ శాఖ. ఓ వైపు గిరిజనుల్లో అవగాహన కల్పిస్తూనే మరోవైపు గంజాయి సాగు వివరాలను సేకరించి ధ్వంసం చేస్తున్నారు.
ఇలా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో గంజాయిని ఏపీ పోలీసులు ఇటీవల దహనం చేసారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది.
ఈ ఆపరేషన్ లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలపై ద్వంసం, సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏవోబి తో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగు పై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ. ఈ క్రమంలోనే భారీగా పట్టుబడిన గంజాయిని దహనం చేసింది.
విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో గంజాయి సాగు అవుతోందని... ఆపరేషన్ పరివర్తన ద్వారా ఈ మండలాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేసినట్లు ఇటీవల మాజీ డిజిపి సవాంగ్ చెప్పారు. గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేశారని.. గంజాయి నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎర్పాటు చేశారని మాజీ డీజీపీ వెల్లడించారు.
ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా విశాఖ లో గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేశామని సవాంగ్ తెలిపారు. ఇప్పటి వరకు 47,987 కిలోల గంజాయి స్వాదినం చేసుకున్నామని.. 46.41 లీటర్లు హషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 314 వాహనాలు సీజ్ చేసామని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 154 మంది స్మగ్లర్లతో పాటు కొత్తగా 300 పైగా హిస్టరీ షీట్లు తెరిచామని మాజీ డీజీపీ చెప్పారు. నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేశామని.. ఇక్కడ పట్టుబడిన 2 లక్షల కేజీల గంజాయి తగులబెట్టామని తెలిపారు.
