రేవంత్ కాంగ్రెస్ లో చేరితేనే చంద్రబాబు సేఫ్...
- తెలంగాణా తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితేనే చంద్రబాబానాయుడు సేఫ్ గా ఉంటారు.
- ఇద్దరి మధ్య విడదీయరాని బంధం ‘ఓటుకునోటు’ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే కదా?
- ఆ కేసులో విచారణ ముందుకు సాగేది లేదు, కాబట్టి కేసు తేలేది లేదు.
తెలంగాణా తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితేనే చంద్రబాబానాయుడు సేఫ్ గా ఉంటారు. ఇద్దరి మధ్య విడదీయరాని బంధం ‘ఓటుకునోటు’ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఆ కేసులో విచారణ ముందుకు సాగేది లేదు, కాబట్టి కేసు తేలేది లేదు. అయితే, కేసు విచారణలో ఎంత జాప్యం జరిగినా ఎప్పటికైనా అటు చంద్రబాబుతో పాటు ఇటు రేవంత్ కు కూడా సమస్యే.
ఎందుకంటే, ఎన్ని సంవత్సరాల తర్వాతైనా సరే విచారణ నిమ్మితం కొన్ని కేసులకు చలనం వస్తుందని, శిక్షలు పడతాయని ఎన్నో సార్లు రుజువయ్యింది. తమిళనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళకు పడ్డ జైలు శిక్షలే అందుకు తాజా ఉదాహరణ.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, రేవంత్ కాంగ్రెస్ లోకి వెళితే చంద్రబాబు ఎలా సేఫ్ గా ఉంటారు? అంటే, రేవంత్ అనుమానిస్తున్నట్లే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్-టిడిపిలు పొత్తు పెట్టుకుంటాయే అనుకుందాం. ఒకవేళ అధికారంలోకి వస్తే ఓటుకునోటు కేసుకు మరికొంత కాలం పాటు ఎటువంటి చలనమూ ఉండదు.
ఎందుకంటే, తెలంగాణా సిఎం కెసిఆర్ కు రేవంత్ పై ఎంత కోపమున్నా చంద్రబాబు కోసం కేసు జోలికి వెళ్ళే అవకాశం ఉండదు. కెసిఆర్ ఆ కేసు జోలికి వెళ్ళనంత వరకూ రేవంత్ కూడా ఎక్కడున్నా సేఫే.
అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చిందే అనుకుందా. అప్పుడైనా చంద్రబాబు సేఫగానే ఉంటారు. ఎలాగంటే, చంద్రబాబును ఇరికిద్దామని కాంగ్రెస్ లో ఎవరైనా అనుకున్నా అదే కేసులో రేవంత్ కూడా ఇరుక్కుంటారు కదా? కాబట్టి రేవంత్ కోసమైనా కాంగ్రెస్ పార్టీ ఓటుకునోటు కేసు జోలికి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే ఏ విధంగా చూసినా అటు చంద్రబాబైనా ఇటు రేవంత్ అయినా ఎప్పటికీ సేఫే. కాకపోతే వాళ్ళ గ్రహస్ధితి ఎప్పుడెలాగుంటుందో మాత్రం చెప్పలేరు కదా?