రేణూ దేశాయ్ కంటతడి: వైఎస్ జగన్ వ్యూహమేనా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి, సినీ నటి రేణూ దేశాయ్ ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా రంగంలోకి దించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి, సినీ నటి రేణూ దేశాయ్ ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా రంగంలోకి దించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కరువు నేపథ్యంలో రైతుల కష్టాలపై, రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం పేరుతో రేణూ దేశాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు పెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆమె శాపనార్థాలు పెట్టారు.
రైతుల సమస్యలపై అధ్యయనంతో పేరుతో రంగంలోకి దిగిన రేణూ దేశాయ్ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ప్రయోగించిన అస్త్రంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి టీవీ లోగోతో ఆమె వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
తంబళబీడు గ్రామంలో నిరుడు ఆగస్టు 25న అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులు నెరణికి బోయరామయ్య, వండ్రమ్మ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.పెద్దకడబూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు పెద్దరంగన్న కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారు చెప్పింది విని ఆమె కంట తడిపెట్టారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రేణూ దేశాయ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా మింగుడుపడకుండా చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన చేస్తున్న సమయంలో అదే జిల్లాలో రేణూ దేశాయ్ పర్యటించడం రాజకీయమేనని అంటున్నారు.