మృతదేహానికి కరోనా పాజిటివ్.. వదిలేసిన బంధువులు, జేసీబీలో...
ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు.
కరోనా వైరస్ కారణంగా ప్రజల్లో మానవత్వం మాయమౌతోంది. వైరస్ సోకిందని తెలిస్తే చాలు.. నా అనేవాళ్లని కూడా దూరం పెట్టేస్తున్నారు. కనీసం మనుషుల్లాగా కూడా చూడటం లేదు. కరోనాతో చనిపోతే.. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... పలాసలో శుక్రవారం ఉదయం ఓ 70ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. కాగా.. ఆయన అంత్యక్రియలకు బంధువులంతా వచ్చారు. ఆయన అనారోగ్యంతో చనిపోయాడని వారంతా భావించారు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు.
అప్పటికప్పుడు ‘వీఎల్ఎం’ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు.
దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీలో మృతదేహాన్ని తరలిస్తున్న వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుడిది 13మంది కుటుంబ సభ్యులు గల ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబసభ్యులే కరోనా అని తేలగానే శవాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీయడం గమనార్హం.
కాగా.. ఈ విషయం కలెక్టర్ దాకా వెళ్లడంతో ఆయన అక్కడికి వెళ్లి సమాచారం సేకరించారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో అధికంగా కరోనా అనుమానిత కేసుల నమోదు, వరుస మరణాలపై ఆరా తీశారు. మృతదేహం తరలింపు విధానంపై పలాస తహసీల్దారు మధుసూదన్, మున్సిపల్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సదరు వృద్ధుడి కుటుంబసభ్యుల కూడా పరీక్షలు చేసే పనిలో పడ్డారు.