తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. 


తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.టీటీడీ ప్రధాన అర్చకులుగా ప్రస్తుతం గొల్లపల్లి వంశానికి చెందిన వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. వేణుగోపాల్ దీక్షితులు పర్మినెంట్ ఉద్యోగి. రమణ దీక్షితులు ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించినా కూడ అధికార బదలాయింపులు ఉండవని అధికారులు ప్రకటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


టీటీడీలో మూడేళ్ల కిందట రిటైరయిన అర్చకులు తిరిగి విధుల్లో చేరవచ్చంటూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండున్నరేళ్ల కిందట హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇప్పుడు గుర్తుచేసుకుని శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ప్రధానార్చకుడిగా ఏవీ రమణదీక్షితులు తిరిగి విధుల్లో చేరారు. కాగా 65ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ వర్తింపజేయాలని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది.

 ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 65ఏళ్లు నిండిన అర్చకులందరినీ రిటైర్‌ చేశారు. ఈ నిర్ణయంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులతో పాటు మూడు ఆలయాల నుంచి 10మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ(కైంకర్యపరులు) అర్చకులు మరో 10 మంది విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరి స్థానంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి వంశం నుంచి ఏఎస్‌ కృష్ణ శేషాచల దీక్షితులు, గొల్లపల్లి వేణుగోపాల దీక్షితులు, పెద్దింటి శ్రీనివాసదీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందాచార్యులను నియమించారు.