యూట్యూబ్ వ్యూస్ కోసం: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, టపాసులు
సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ కోసం యువత నానారకాల పాట్లు పడుతోంది. యూట్యూబ్ చానెల్ కోసం ఓ యువకుడు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టాడు
చిత్తూరు: తన యూ ట్యూబ్ ఛానెల్కు ఎక్కువ వీక్షకులను రాబట్టుకొనేందుకు రాంరెడ్డి అనే యువకుడు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, బైకులు పెట్టాడు.ఈ దృశ్యాలను రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఈ విషయమై రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా చెల్లూరుకు చెందిన రాంరెడ్డి అనే యువకుడు యూట్యూబ్ లో వీడియోలు తీసేవాడు. రైలుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో ఎక్కువ మంది వీక్షిస్తున్న విషయాన్ని గుర్తించిన రాంరెడ్డి తన యూట్యూబ్ లో చానెల్ లో కూడ ఇదే తరహాలో వీడియోలను అప్ లోడ్ చేయాలని భావించాడు.
ఇదే అదనుగా భావించిన రాంరెడ్డి రైలు పట్టాలపై ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బైకులు పెట్టి వీడియోలు చిత్రీకరించి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. ఇదే తరహ వీడియోను నర్సింహ్మ అనే వ్యక్తి చూశాడు. ట్విట్టర్ వేదికగా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నర్సింహ్మ అభిప్రాయపడ్డారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రైల్వే పోలీసులు రాంరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే తన మాదరిగా మరేవరూ కూడ ఈ తరహలో యూట్యూబ్ వీడియోలు రికార్డు చేయకూడదని రాంరెడ్డి కోరారు.
రైలు వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తున్న విషయాన్ని గుర్తించి తాను ఈ వీడియాలను రికార్డు చేసినట్టుగా రాంరెడ్డి తెలిపారు.