రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రేపటి నుంచి సెలవులో వెళ్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రేపటి నుంచి సెలవులో వెళ్తున్నారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవులోకి ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ బుధవారం పరిశీలించిన సంగతి తెలిసిందే.

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైయిన చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించారు. అలాగే ఇంటి భోజనం అందించేందుకు అనుమతి ఇస్తున్నారు. 

అయితే జైలులో చంద్రబాబు భద్రతపై ఆయన తరఫు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రోజున జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సతీమణి భువనేశ్వరి.. జైలులో చంద్రబాబుకు నెంబర్ వన్ సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ఆయన భద్రతపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.