మోడీని జగన్ కలిసిన రోజే నాపై కేసు, త్వరలో వారు జైలుకే..: రఘురామ
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీని కలిసిన రోజే తనపై సీబిఐ కేసు పెట్టిందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు అన్నారు. మూడు, నాలుగు నెలల్లో జైలుకు వెళ్లేవారిపై తాను కేసు పెట్టనని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: తనపై సీబీఐ కేసు నమోదు చేయడంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు స్పందించారు. తనను ఎంపీగా అనర్హుడిని చేయలేకనే వైసీపీ నేతలు దిగజారుజు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగవేశాడని ఆరోపిస్తూ ఓ పత్రిక రాసిన కథనంతో వారి విశ్వసనీయత మరింత దిగజారిందని ఆయన అన్నారు.
తప్పుడు కథనాలు రాసినవారిపై పరువు నష్టం దావా వేయాలని తమ న్యాయవాదులు సూచిస్తున్నారని, 3,4 నెలల్లో జైలుకు వెళ్లేవారిపై మరో కేసు ఎందుకని అనుకుంటున్నానని ఆయన అన్నారు. రఘురామ రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగుతోంది.
వ్యాపారం కోసం రుణం తీసుకుని రూ.826.17 కోట్లు దారి మళ్లించారంటూ రఘురామకృష్ణమ రాజుకు చెందిన ఇండ్- భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థపైనా, దాని డైరెక్టర్లు, అధికారులపైనా సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణమ రాజు శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
బ్యాంకుల ద్వారా తనకు మంజూరైన మొత్తం రుణం రూ.4 కోట్ల లోపేనని, అందులో రూ.2 వేల కోట్లు తాను బ్యాంకు నుంచి ఇప్పటి వరకు కూడా డ్రా చేయలేదని ఆయన అన్నారు. తనపై కేసు నమోదైన 6వ తేదీన ప్రధాని మోడీని ముఖ్యమంత్రి జగన్ కలిశారని, అదే రోజు పంజాబ్ నేషనల్ బ్ాయంక్ చైర్మన్ ముఖ్యమంత్రిని కలవడం అనుమానాస్పదంగా ఉందని రఘురామ కృష్ణమ రాజు అన్నారు.
వారిపై రూ.43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నందుననే తనపై రూ.23 వేల కోట్లకు సంబంధించి ఆరోపణలు చేసి ఉంటారని ఆయన అన్నారు. తన వ్యాపార లావాదేవీల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని, సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఆయన అన్నారు. నిధులు తాను తినేస్తే ప్రాజెక్టులు ఎవరు కడుతారని ఆయన అడిగారు. ఈ అంశాలను కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న తన బ్యాచ్ మేట్ ద్వారా సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాశ్ తనపై కేసు నమోదు అయ్యేలా చేశారని ఆయన ఆరోపించారు.
తనను బతిలాడి వైసీపీలోకి తీసుకుని వచ్చిన రెండో రోజే తనకు టికెట్ ఇవ్వకూడదని కుట్ర చేశారని రఘురామకృష్ణమ రాజు ఆరోపించారు ప్రశాంత్ కిశోర్ జోక్యంతోనే తనకు టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు సీఎం చర్యల వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.