అశోక గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు... అదుపుచేయండి: జగన్ కు రఘురామ లేఖ
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వైసిపి నాయకులను అదుపుచేయాలని ఎంపీ రఘురామ సీఎం జగన్ ను కోరారు.
న్యూడిల్లి: ముఖ్యమంత్రి జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వైసిపి నాయకులను అదుపుచేయాలని రఘురామ జగన్ ను కోరారు. ఈ మేరకు జగన్ కు 10వ లేఖ రాశారు.
మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం ఆలయ ఛైర్మన్ గా అశోక గజపతి రాజును రాష్ట్ర హైకోర్టు తిరిగి నియమించిందని రఘురామ గుర్తుచేశారు. అయితే ఆయన దొడ్డిదారిన ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డితో నాటు మరికొందరు వైసిపి నాయకులు అనుచితంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనపై ఇలా వ్యక్తిగత విమర్శలు తగదని... ఇకపై వైసిపి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అదపుచేయాలని సీఎం జగన్ ను కోరారు రఘురామ.
read more వైఎస్ జగన్ బండారం బయటపెడ్తా, బెయిల్ రద్దు ఖాయం: గోనె ప్రకాశ్ రావు
ఇప్పటికే సంపూర్ణ మద్యపాన నిషేధం హామీపై సీఎంని ప్రశ్నిస్తూ రఘురామ లేఖ రాసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధ హామీ అమలు కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ కంటే మద్యపాన ప్రోత్సాహకం జరుగుతోందని ఎద్దేవా చేశారు.
''ఏపీలో గతేడాదితో పోలిస్తే16 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. .మద్యనిషేధం అమలు హామీతోనే మహిళలు వైసీపీకి ఓటువేశారు. అమ్మ ఒడి ద్వారా పేదలకు మీరిచ్చే డబ్బు.. మద్యం ధరల పెంపుతో తిరిగి వసూలు చేస్తున్నారన్న చర్చ మొదలైంది. అమ్మ ఒడి-నాన్న బుడ్డి పథకం అని ఎగతాళి చేస్తున్నారు'' అని అన్నారు.
''సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయండి లేదా కనీసం నాణ్యమైన మద్యాన్ని అందించండి. మద్యం రేట్లను తగ్గించండి. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మన పథకాన్ని ఇల్లు గుల్ల... ఒళ్లు గుల్ల పథకంగా ప్రజలు చెప్పుకుంటారు'' అని రఘురామ సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.