ఒలింపిక్స్2024 లో స్వర్ణం సాధించేలా చూడమ్మా: విజయవాడ దుర్గమ్మను కోరుకున్న పివి సింధు (వీడియో)
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన పివి సింధు 2024లో జరిగే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించేలా ఆశీర్వదించాలని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను కోరుకున్నారు.
విజయవాడ: టోక్యో ఒలిపింక్స్ 2020లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు తెలుగురాష్ట్రాల్లో ఘనస్వాగతం లభిస్తోంది. రెండో ఒలింపిక్ పతకంతో ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు చేరుకున్న సింధుకు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సింధుకు గ్రాండ్ గా వెల్ కం చెప్పారు.
విజయవాడకు చేరుకున్న సింధు ఇంద్రకీలాద్రికి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి చేరుకున్న సింధుకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న సింధు కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం చేశారు వేద పండితులు. సింధుకు శాలువా కప్పి సత్కరించిన ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.
వీడియో
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.... టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానన్నారు. మళ్లీ ఇప్పుడు కాంస్య పతకంతో ఆలయానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా చాలా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందని... అన్నింట విజయాలు అందించాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. 2024లో కూడా ఒలింపిక్స్లో ఆడి స్వర్ణం సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు సింధు తెలిపారు.
అంతకుముందు మంత్రులతో కలిసి మీడయాతో మాట్లాడిన సింధు ఒలింపిక్స్ వెళ్లేముందు సిఎం జగన్ తనకు చాలా సపోర్ట్ చేశారన్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. మనోధైర్యంతో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి టోక్యో వెళ్లి పతకం తేవడం సంతోషంగా ఉందన్నారు. సెకండ్ టైమ్ ఒలింపిక్ మెడల్ దేశానికి తేవడం సంతోషంగా ఉందన్నారు, నాపై అభిమానం చూపిన వారందరికి మెడల్ డెడికేడ్ చేస్తున్నానని సింధు పేర్కొన్నారు.