బతుకు దెరువు కోసమే ఈ ఇంగ్లీష్ బాబూ అంటుంటే వాళ్లకి   ముప్పేదో ముంచుకొస్తున్నట్లు  పీడకలలు  వస్తున్నాయి

తెలుగే కావాలంటున్నారు వీళ్లు, స్కూళ్లలో తెలుగులోనే విద్యాబోధన చేయాలంటున్నారు. దీనికోసం ఉద్యమం అంటున్నారు.

ఫిబ్రవరి 19 వ తేదీన విజయవాడలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు.

కారణమేంటంటే, పురపాలక శాఖ నిర్వహించే పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేస్తూ ఇచ్చిన జివొ 14 .

దీనిని రద్దుచేయాలని మాతృభాష మాద్యమం వేదిక డిమాండ్ చేస్తున్నది.

 స్కూళ్ళలో ఏ భాష లో విద్యాబోధన జరగాలనేదానిమీద తల్లితండ్రులకు, ప్రభుత్వానికి, కొంతమంది భాషాభిమానులకు ఆంధ్రలో తేడా లొచ్చాయి. 

మారుతున్న కాలంలో తమ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప పోటీల పరీక్షలలో నెగ్గలేరు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్టు కాలేరని భయం చాలా మందిలో ఉంది. అందుకు తల్లితండ్రులంతా ఇంగ్లీష్ మీడియం ప్రయివేటు స్కూళ్ల మీద పడుతున్నారు. ఈ డిమాండ్, వత్తిడి వల్ల మునిసిపల్ శాఖ మునిసిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది. ప్రపంచమంతా పోటీ తత్వం పెరిగిపోయింది, తెలుగురాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు విదేశాలనుంచి వస్తున్నాయంటున్నారు. ఈ సంస్థలలో ఉద్యోగాలు రావాలంటే, ఇంటర్వ్యూలలో నాలుగు ముక్కలు ఇంగ్లీషు రావాలి, అందువల్ల ఇంగ్లీష్ నేర్పాలన్నది ప్రభుత్వం నిర్ణయం. తల్లితండ్రుల ఆరాటం కూడా. వచ్చేవన్నీ ప్రయివేటు కంపెనీలు కాబట్టి, ఇంగ్లీషు కొంతమయిన మాట్లాడే శక్తి లేకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఎంపిక కాలేరన్నది ప్రభుత్వం భావన. అందువల్ల ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే, భాష పరిచయం అవుతుంది, ఇది తెలుగును ఏమాత్రం దెబ్బతీయదని వారిభావన.

అయితే, ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అనే సరికి, తెలుగు రక్షకులు తోడయ్యారు. తెలుగుకు ప్రమాదం వచ్చేసింది బాబోయ్, భాష అంతరించిపోతున్నదని, మాతృభాష ఏమిటి, తెలుగు సంస్కృతి ఎటుపోతున్నదని వారు అరుస్తున్నారు.

పిల్లలు ఇంగ్లీష్ చదువు కుంటే తెలుగెలా అంతరిస్తుందో అర్థం కాదు. వీరంతా తెలుగు మీద సామాజిక హోదా అను భవించిన విద్యారంగం , లేదా భాషారంగాలలో పని చేసిన వారు. అందువల్ల మరొక భాష ముఖ్యంగా ఇంగ్లీష్ పేరు వినిపించగానే వీళ్లకి తెలుగు కష్టాలు గుర్తుకొస్తాయి. హిందీని దేశం మీద రుద్దినపుడు, తెలుగువోరియంటల్ కళాళాలను చంపేస్తున్నపుడు, హిందీలోనే కేంద్ర పరీక్షలు రాయలన్నపుడు వీరెవరూ మాట్లాడలేదు.

బతుకు దెరువు కోసం ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పాలనుకుంటుంటే, వీళ్లకి హఠాత్తుగా మాతృదేవత గుర్తుకొచ్చింది. ముప్పేదో ముంచుకొస్తున్నట్లు పీడకలలు కంటున్నారు. వీరిపిల్లలను వీరు మునిసిపల్, జిల్లా పరిషత్ స్కూళ్లకు పంపనే లేదు. తెలుగు మీడియంలో చదివించనేలేదు.

వీళ్లకేమో అల్పాదాయ వర్గాల పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోరాదు. 

 పాలకులు ప్రజల భాషలను అధోగతి పట్టిస్తున్నారని ఈ వేదిక నాయకులు ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం, సామాల రమేష్‌ బాబు, ఎస్‌ఆర్‌ పరిమి, గారపాటి ఉమామహేశ్వరరావు, డి రమేష్‌ పట్నాయక్‌ ఒక ప్రకటనలో విమర్శించారు.

పిల్లల వికాసానికి ఆంగ్ల మాధ్యమాన్ని గొడ్డలిపెట్టు అంటున్నారు.

 1980 నుంచిప్రైవేట్‌ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు విజృంభిస్తున్నాయని ఆంగ్ల మాధ్యమం ఒక మహమ్మరిగా తెలుగు సమాజాన్ని ఆవహించిందని చెబుతున్నారు.

2006లో వచ్చిన 76 జీవో ప్రభుత్వ రంగ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టారని, 2014లో విడుదల అయిన 53 జీవో ద్వారా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ ఏడాది జీవో 14 ద్వారా మున్సిపల్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల స్థాయుల్లో మాతృభాషా మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారని తెలిపారు.

దీనిపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలిపారు. విద్యా బోధనలో మాతృభాషా మాధ్యమాన్ని కాపాడడం కోసం నిరంతరం కార్యక్రమాల్ని వేదిక తరఫున చేపడతామని తెలిపారు. మొత్తం విద్యారంగంలో ప్రభుత్వ భాషా విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 19న ధర్నా చౌక్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరుగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లోని మేధావులు, నిపుణులు, ఉపాధ్యాయులు, రచయితలు, కళాకారులు, భాషోద్యమకారులు ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలని కోరారు.

.