వైసిపిలోకి ప్రముఖ బిల్డర్
వచ్చే ఎన్నికల్లో వైసిపి తరపున ప్రముఖ బిల్డర్ పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. విశాఖపట్నంకు చెందిన ప్రముఖ బిల్డర్ ఎంవివి సత్యనారాయణ వైసిపి టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అందుకోసం పార్టీలోని కీలక నేతను కలిసి తన మనసులోని మాటను చెప్పుకున్నారట. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నపుడు జగన్ ను కలవాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో కీలక నేతను మాత్రం కలిశారు.
ఇంతకీ ఈ బిల్డర్ వైసిపి తరపున విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయటానికి ఎందుకంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు? అంటే టిడిపిలోని ఓ నేతతో ఈయనకు వ్యక్తిగతంగా వివాదాలున్నాయట.
ఆ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకే వైసిపి టిక్కెట్టు కోసం అంతలా ప్రయత్నాలు చేసుకుంటున్నారట.
ఒకవేళ తనకు ఎంపి టిక్కెట్టు ఇస్తే తన ఖర్చులకు పార్టీ ఒకరూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారట. అంతేకాకుండా పార్టీకే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట.
అదేంటంటే, ఎంపి నియోజకవర్గం పరిధిలో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్ధులకు కూడా తానే ఖర్చులు పెట్టుకుంటా అని హామీ ఇచ్చారట.
మరి జగన్ మనసులోని మాటేంటో తెలీదు.
అయితే, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుండి పోటీలోకి దింపవచ్చని ఓ ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్ విశాఖపట్నంలో పాదయాత్ర మొదలుపెట్టే సమయంలో పార్టీ తీర్ధం పుచ్చుకోవటానికి బిల్డర్ సిద్ధంగా ఉన్నారట.