వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూర్లో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూర్లో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. సునీతా రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆ పోస్టర్లపై సునీతా రెడ్డి ఫొటోతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫొటోలను కూడా ఉంచారు. మంగళవారం తెల్లవారేసరికి ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు దర్శనమిచ్చారు. అయితే ఈ పోస్టర్ల ఎవరూ ఏర్పాటు చేశారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే తాజాగా ఈ పోస్టర్ల వ్యవహారంపై ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరులో వైఎస్ సునీత ఫోటోతో వచ్చిన పోస్టర్లకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా చేస్తుందని ఆరోపించారు. వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయిందని.. అరెస్టు అవుతాడనే వార్తల నేపథ్యంలో.. ఇష్యూను డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పోస్టర్లు అతికించారని తనకున్న సమాచారం అని చెప్పారు. ఇదే విషయం కొందరు పోలీసులను అడిగితే సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని చెబుతున్నారని తెలిపారు. ఈ పోస్టర్లు అతికించిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం దారుణం అని అన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏదో ఒక గొడవ సృష్టించి టీడీపీ నాయకుల ఇళ్లపై, వ్యాపార సముదాయాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. సునీత ఒకవేళ రాజకీయాల్లో చేరాలనుకుంటే.. అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇలాంటి పోస్టర్లను ప్రజలు, తెలుగుదేశం శ్రేణులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా నమ్మవద్దని కోరుతున్నట్టుగా చెప్పారు.
