ఫెయిల్ చేస్తానని బెదిరించి బాడీ మసాజ్... యువతిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచక ప్రిన్సిపాల్. ఈ ఘోరం విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం: అమ్మాయి కనిపిస్తే చాలు కామాంధులు రాక్షసంగా వ్యవహరిస్తుంటారు. కొందరు నేరుగా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే మరికొందరేమో పెదమనుషుల ముసుగులో, హోదాను అడ్డంపెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. తప్పుచేస్తే మందలించి బుద్దిచెప్పాల్సిన ఓ ప్రిన్సిపల్ తప్పుడు పని చేశాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే పరీక్షల పేరిట బెదిరించి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అమానుషం విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని ఓ గిరిజన తండాకు చెందిన ఓ యువతి కాకినాడలోని ఓ నర్సింగ్ కాలేజిలో చదువుతోంది. ఆమె ప్రాక్టికల్స్ పరీక్షల కోసం ఇటీవల విశాఖపట్నంలోని మధర్ థెరిస్సా నర్సింగ్ కళాశాలకు వెళ్లారు. అయితే ఇలా పరీక్షల కోసం వచ్చిన సదరు యువతిపై కాలేజీ ప్రిన్సిపల్ వెంకట్రావు కన్నేశాడు.
read more లాడ్జికి తీసుకెళ్లి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం...
యువతిని తన గదిలోకి పిలుచుకుని చెప్పినట్లు నడుచుకోకుంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఇలా యువతితో ఒళ్లంతా మసాజ్ చేయించుకున్నాడు. ఒక్కసారి కాదు ఇలా ఒకే రోజు మూడుసార్లు మసాజ్ చేయించుకుంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు లైంగిక దాడికి కూడా ప్రయత్నించగా యువతి తప్పించుకుంది.
ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించిన విషయాన్ని బాధిత యువతి తన సోదరుడికి తెలిపింది. దీంతో అతడు ఆమెతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు కీచక ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్ వెంకటరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.