తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము.. తీర్థప్రసాదాలు అందజేసిన వేదపండితులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారిగా శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ద్రౌపది ముర్ము తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
సోమవారం ఉదయం అతిథిగృహం నుంచి బయలుదేరిన ద్రౌపది ముర్ము.. తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. రాష్ట్రపతికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. టీడీపీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు.. 2023 సంవత్సరం డైరీ, క్యాలెండర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఇక, అతిథిగృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ద్రౌపది ముర్ము తిరుపతికి చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వేళ తిరుపతి, తిరుమలలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.