Asianet News TeluguAsianet News Telugu

అన్న చేతిలో అవమానం... మనస్తాపంతో నిండు గర్భిణి ఆత్మహత్య

 కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పురిటి కోసం పుట్టింటికి వచ్చిన నిండు గర్భిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Pregnant woman found hanging in home in krishna district akp
Author
Vijayawada, First Published Aug 2, 2021, 11:26 AM IST

విజయవాడ: సోదరుడితో జరిగిన చిన్న గొడవ ఓ నిండు గర్భిణి ప్రాణాలను బలితీసుకుంది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణి-సోదరుడికి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగ్గా... సోదరుడు తనను తిట్టాడన్న చిన్న కారణంతో మనస్తాపానికి గురయిన గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

 కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన నాగ భార్గవి(20)కి ఏడాది క్రితం హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసే సాయి శంకర్ తో వివాహమయ్యింది. వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన భార్గవి ఇటీవలే ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. 

అయితే భార్గవి సోదరుడు నిఖిల్ నిత్యం తల్లిని, చెల్లిని మాటలతో వేధించేవాడు. ఇలా నిన్న(ఆదివారం) కూడా భార్గవితో నిఖిల్ గొడవకు దిగాడు. తోబుట్టువుపై ప్రేమ లేకపోగా నిండు గర్భిణి అన్న విషయాన్ని కూడా మరిచి భార్గవిని సోదరుడు అనరాని మాటలు అన్నాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయి దారుణ నిర్ణయం తీసుకుంది. 

read more  గోదావరిలో దూకి ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య: ఇద్దరి పిల్లల మృతదేహలు లభ్యం

ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంటగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది భార్గవి. తల్లి నాగలక్ష్మి ఇంటికి వచ్చి చూసేసరికి భార్గవి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఇరుగుపొరుగు వారి సాయంతో కిందకు దింపి కొనఊపిరితో వున్న ఆమెను హాస్పిటల్ కు తరలించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే భార్గవి మృతి చెందింది. 

నిండు గర్భిణి అయిన కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్గవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios