గర్బిణీకి పురిటినొప్పులు.. వాగులో వరద ఉద్ధృతి, చెట్టుకొమ్మలతో గిరిజనుల సాహసం
గర్బిణీని కోరుకొండ పీహెచ్సీకి తరలించేందుకు విశాఖ ఏజెన్సీకి చెందిన గిరిజనులు అష్టకష్టాలుపడ్డారు. వర్షంలో అడవి మార్గం గుండా డోలీని మోసి మత్స్యగడ్డ పాయ వరకు చేర్చగలిగారు. అక్కడి నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో గ్రామస్తులకు ఎటూ పాలుపోలేదు
ఏవోబీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. విశాఖ మన్యంలోని వరదల్లో నిండు గర్బిణీని ఆసుపత్రికి తరలించడానికి కుటుంబసభ్యులు సాహసం చేయాల్సి వచ్చింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మహిళకు నెలలు నిండిపోయాయి. గర్బిణీని కోరుకొండ పీహెచ్సీకి తరలించేందుకు కుటుంబసభ్యులు అష్టకష్టాలుపడ్డారు.
వర్షంలో అడవి మార్గం గుండా డోలీని మోసి మత్స్యగడ్డ పాయ వరకు చేర్చగలిగారు. అక్కడి నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో గ్రామస్తులకు ఎటూ పాలుపోలేదు. దీంతో ఎండిన చెట్టును ఆధారంగా చేసుకుని మత్స్యగడ్డను దాటడం జరిగింది. ఆ సమయంలో ప్రవాహ వేగానికి ప్రభావితం కాకుండా అత్యంత ఒడుపుగా వరదనీటిని దాటించాల్సి వచ్చింది. వాగు దాటిన తర్వాత మెడికల్ సిబ్బంది అందుబాటులోకి రావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణమంటే ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి.