ప్రణయ్ పరువు హత్య.. గుంటూరు పోలీసులకు తలనొప్పి
వీరితో పాటు రోజుల వ్యవదిలో వివాహాలు చేసుకున్న వారు, వివాహాలకు సిద్ధమైన వారు భయంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
మిర్యాలగూడ లో ప్రణయ్ హత్య, హైదరాబాద్ లో సందీప్, మాదవీ దంపతుల దాడి ఎఫెక్ట్.. గుంటూరులో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు అంగీకరించని తండ్రులు.. కన్న బిడ్డలను సైతం చంపేందుకు వెనకాడటం లేదు. దీంతో.. ఇలాంటి మరెన్నో ప్రేమ జంటలు ఇప్పుడు పోలీసు స్టేషన్ బాటపట్టాయి. మాకు రక్షణ కల్పించడండి అని పోలీసులను కోరుతున్నారు.
ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిలో కొంత భయం ఉండడం సహజమే. అయితే మిర్యాలగూడ, హైదరాబాద్ ఘటనలతో గుంటూరు జిల్లాలోని ప్రేమికుల్లోను భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని ఇరు కుటుంబ సభ్యులు హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జంటల్లో ఈ ఘటనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వీరితో పాటు రోజుల వ్యవదిలో వివాహాలు చేసుకున్న వారు, వివాహాలకు సిద్ధమైన వారు భయంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
కొందరు పెళ్ళి చేసుకోకుండానే పోలీసు కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. తమకు పెళ్ళి చేయాలని కోరుతున్నారు. తాము పెళ్ళి చేయబోమని, ఇరువురు మేజర్లు అయి ఉండి పెళ్ళి చేసుకుని వస్తే రక్షణ కల్పిస్తామని పోలీసులు సూచిస్తున్నారు. ప్రేమ వివాహాల వల్ల భవిష్యత్తు పరిణామాలపై వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే ఆయా జంటలు వారి మాటలు వినే పరిస్థితిలో ఉండడం లేదు. తాము ఇంట్లో నుంచి పారిపోయి వచ్చామని, మా వారి కంట పడితే చంపేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా జంటల్లో కొందరు మైనర్లు కూడా ఉంటుండడం గమనార్హం...