నేటితరం నేతల్లో జగన్ మెరుగైనవాడు, పవన్ పవరేంటో తెలీదు : పోసాని కృష్ణ మురళి
టిడిపిని ఎవరూ నమ్మే పరిస్థితులు లేవన్న పోసాని
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడున్న నాయకుల్లో మెరుగైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డేనని కొనియాడారు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి. ఒ వైపు జగన్ ను పొగుడుతూనే అధికార పార్టీని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో జగన్ తో కలిసి పోసాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆకాశానికెత్తారు. జగన్ అధికారం కోసం అడ్డదారులు తొక్కేవాడు కాదని, అందుకోసం అనవసర హామీలిచ్చే రకం కాదని అన్నారు. ఆయనో కమిట్ మెంట్ ఉన్న లీడర్ అంటూ పొగిడారు. జగన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికే పాదయాత్రలో పాల్గొన్నానని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని అన్నారు. ఏపిలో ఇప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వంపై నమ్మకం పోయిందని పోసాని విమర్శించారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి పోసాని మాట్లాడుతూ...ఆయన శక్తి ఏంటో ఇప్పడే చెప్పలేమని అన్నారు. కానీ పవన్ కంటే ముందే జగన్ రాజకీయాల్లో ఉండి నిలబడ్డారని అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాదు, ప్రవేశించి నిలబడ్డవాడే నిజమైన నాయకుడు అని పోసాని వివరించారు.
ఇక తన రాజకీయ భవిష్యత్ గురించి పోసాని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుండి పోటీ చేయనని అన్నారు. ఎన్నికలంటే డబ్బు, మద్యం పంచాలి. అది తనకు ఇష్టం లేదు. అందువల్లే ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.