రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేకే వైసీపీ కుట్ర...యరపతినేని
రాజకీయంగా తననను ఎదుర్కొనలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనపై అక్రమ మైనింగ్ ఆరోపణలు చేస్తుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
గుంటూరు:
రాజకీయంగా తననను ఎదుర్కొనలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనపై అక్రమ మైనింగ్ ఆరోపణలు చేస్తుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గురజాల నియోజకవర్గంలో తాను ఎలాంటి అక్రమ మైనింగ్ లకు పాల్పడలేదని సరస్వతి సిమ్మెంట్ కంపెనీ భూముల వ్యవహారంలో ప్రజలకు అండగా ఉన్నాననే దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రపన్ని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాను అక్రమమైనింగ్ కు పాల్పడుతున్నానంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి 2011లో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సైతం అక్రమ మైనింగ్ పై లేఖ రాశారని గుర్తు చేశారు. అందుకు ఆధారాలను సైతం విడుదల చేశారు. అంటే అక్రమ మైనింగ్ ఎప్పటి నుంచి జరుగుతుందో ప్రజలు గమనించాలని కేవలం తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే వైసీపీ కుట్రలు పన్నుతుందన్నారు. గత ప్రభుత్వంలో అక్రమమైనింగ్ జరిగిందని ఆ అక్రమ మైనింగ్ సొమ్ముతోనే ఎవరు పేపర్ పెట్టారో, ఛానెల్స్ పెట్టారో, పార్టీ పెట్టారో ప్రజలకు తెలుసునన్నారు. ప్రస్తుతం అక్రమమైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని 20 ఏళ్లుగా ఆ ప్రాంతలో ఎవరు మైనింగ్ చేస్తున్నారు ఏం జరుగుతుందో వాస్తవాలు వెలికి తీస్తారన్నారు. ప్రస్తుతం ఆకంపెనీల్లో 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వాళ్ల పొట్టకొట్టే విధంగా వైసీపీ చేస్తుందని ఆరోపించారు.
ఇకపోతే పిటిషనర్ కోర్టులను సైతం తప్పదారి పట్టిస్తున్నారన్నారు. పిటీషన్ లో వేరే శాటిలైట్ కంపెనీ నుంచి వచ్చిన ఛాయాగ్రహ చిత్రాన్ని పొందుపరిచారని చెప్పడం ఎంతమేరకు అవగాహన ఉందో అర్థమవుతుందన్నారు. ప్రతీ శుక్రవారం కోర్టుమెట్లు ఎక్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తనను విమర్శించే అర్హత లేదన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. సరస్వతి సిమ్మెంట్ కంపెనీ భూముల వ్యవహారంలో ప్రజల పక్షాన ఉన్నందుకే ఇబ్బందులు పాల్జేస్తున్నారని అయినా బెదరనన్నారు. సరస్వతి సిమ్మెంట్ కంపెనీ నిర్మిస్తామని ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కుని ఇప్పటికీ కంపెనీ పెట్టలేదని అందువల్ల రైతులకు అండగా ఉంటే తనపై అక్రమ మైనింగ్ అంటూ ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సరస్వతిసిమ్మెంట్ కంపెనీ భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ఎప్పటి లోగా కంపెనీ నిర్మిస్తారో క్లారిటీ తీసుకువస్తానన్నారు....వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు.