పెద్ద నోట్ల కష్టాల్లో ఉన్నా పరాచకాలకు కొదవ లేదు
తాత్కాలికంగా అయినేతేం, రాజకీయకులందరికి మోదీ పెద్ద నోట్ల దెబ్బ తగిలుంటుంది. అయినా సరే, తెలుగు రాజకీయాల్లో హాస్యానికి కొదవలేదు
పెద్ద నోట్ల రద్దు గురించి రోడ్ల మీద, సోషల్ మీడియాలో, రాజకీయాల్లో ఎంత హాస్యం ప్రవహిస్తున్నదో. నిజానికి , నోట్ల దెబ్బతో నొప్పి కంటే గిలిగింతలే ఎక్కువవుతున్నాయి. తెలుగు రాజకీయాలలో నిన్న పేలిన మూడు ఛమక్కులు :
పెద్ద నోట్ల రద్దు గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసని అందుకే ఆ క్రెడిట్ కొట్టేయడం కోసం ముందుగానే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తున్నది. అయినా, సరే ముఖ్యమంత్రి మంత్రులు నోట్ల సర్దుకునే పనుల్లో పడ్డారని, వారి మీద నిఘాపెట్టాలని ఈ పార్టీని కేంద్రాన్ని కోెరింది.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీ అధినేతకు పక్కా సమాచారం ఉందని అం దుకే ఆయన ముందుగా జాగ్రత్త పడ్డారని ప్రతిపక్ష పార్టీ సీనియర్ నాయకుడు బోత్సా సత్యనారాయణ అన్నారు.
చంద్రబాబు పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ గత నెల 12న ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆ తర్వాత జరిగిన మరో పరిణామం కూడా ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ఉంది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్కి విక్రయించడం, దీనికి ప్రతిఫలంగా నగదును కాదని ఆ సంస్థ వాటాను తీసుకోవడం కూడా ఈ అనుమానాలను బలపరిచేదిగా ఉందని పార్టీ అంటోంది. సరిగ్గా ప్రధాని మోది ప్రకటన ముందు రోజు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరడం విశేషం. చంద్రబాబు ముందుగా తెలియడం వల్లనే నగదును తీసుకోలేదని, ఇలా పెద్దనోట్ల రద్దు జరిగేనాటికి పెద్దవాళ్లంతా సర్దుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిపైనా, టీడీపీ మంత్రుల పైనా కేంద్రం గట్టి నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ మీద సానుభూతి వచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటించిన నిర్ణయం విన్నాక తను షాక్ కు గురయ్యానని ఆయన చెప్పారు. ఎందుకంటే, అప్పుడు తన దగ్గిర ఉన్న అరడజను నోట్లన్నీ అయిదొందలవే. ఇక చిల్లర లేదు, ఎలా అని ఆయన ఆందోళన కు గురయ్యారట. అయితే, తన కంటే, ఎక్కువగా జగన్ ఆందోళన చెంది ఉంటాడని, దానిని ఎలా తట్టుకుని ఉంటాడని కూదా ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. కారణం – జగన్ బెంగళూరు భవంతిలో నేలమాళిగ లో లెక్క లేనంత నల్లధనం అయిదొందల, వేయి రుపాయల్లోనే ఉంటుందని, వీటిని తలుచుకుని జగన్ తప్పనిసరిగా షాక్ కు గురయి ఉంటారని ఆయన అన్నారు.
ఇక అటూ వైపు తెలంగాణా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనుమానాలు చూడండి :
దొంగనోట్ల ప్రకటన వచ్చాక తెలంగాణా రాష్ట్ర సమితి ఖంగుతినిందని తెలుగుదేశం నాయకుడురావుల చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. వసూలుచేసుకున్న కమిషన్ అంతా యిదొందలు, వేయి రుపాయల నోట్లలో ఉన్నందున నిన్నంతా రాష్ట్ర ఐటి మంతి కెటి రామారావు, ఆయన సోదరి నిజాంబాద్ ఎంపి కవిత ఈ నోట్లు సర్దుకోవడంతో బిజీ అయ్యారని ఆయన చెప్పారు.
ఆయన దీనికి రెండు సాక్ష్యాలు కూడా చూపించారు. ఒకటి, కెటి రామారావు ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుని ఇంట్లో మూలుగుతున్న పెద్ద నోట్లను సర్దుకున్నారట. ఇలాగే కవిత కూడా నిన్నంతా ఇల్లు సర్దు కున్నారట. ఇల్లు సర్దు కోవడమేంటే, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల్లో వసూలు చేసిన నల్లధనాన్ని సర్దు బాటు చేసుకునే కార్యక్రమమనని ఆయన అనుమానించారు.