శ్రీశైలంలో డ్రోన్ల కలకలం: పట్టుకొనేందుకు పోలీసుల యత్నం
శ్రీశైలం మహాక్షేత్రంలో అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రిపూట తిరుగుతున్న డ్రోన్ కెమెరాలు ఇప్పుడు ఆలయ పరిసరాల్లో తిరగడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రిపూట తిరుగుతున్న డ్రోన్ కెమెరాలు ఇప్పుడు ఆలయ పరిసరాల్లో తిరగడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజులుగా రాత్రిపూట ఆకాశంలో డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో శ్రీశైలం చుట్టు ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి.
ఆలయ పరిసరాల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీశైలం ఆలయ పరిసరాల్లో డ్రోన్లు కన్పించడంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ డ్రోన్లను ఎవరు ఆపరేట్ చేస్తున్నారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆకతాయిలు ఈ డ్రోన్లను ఉపయోగించారా లేక ఇతరులు ఎవరైనా వీటిని వాడారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.