వెలగపూడిలో రైతుల దీక్ష భగ్నం: అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు
తమ డిమాండ్ ను వైసీపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశ్యంతోనే ఇద్దరు యువ రైతులు చేస్తున్న నిరహారదీక్షను ఆదివారం నాడు అర్ధరాత్రి పోలీసులు వెలగపూడిలో భగ్నం చేశారు.
అమరావతి: వెలగపూడిలో 151 గంటల పాటు దీక్షను పోలీసులు ఆదివారం నాడు అర్ధరాత్రి భగ్నం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు తమ నిరసనను తెలపాలనే ఉద్దేశ్యంతో శ్రీకర్, రవిచందర్ లు 151 గంటల పాటు నిరహారదీక్షకు దిగారు.
ఆదివారం నాడు రాత్రి ఒంటిగంటకు దీక్ష శిబిరంలో ఉన్న రైతులను పోలీసులు తీసుకెళ్లారు. అయితే దీక్షను పోలీసులు భగ్నం చేయకుండా స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. స్థానికంగా ఉన్న గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు ర్యాలీగా వచ్చి దీక్షకు దిగిన రైతులకు తమ సంఘీభావం తెలిపారు.
దీక్ష చేస్తున్న ఇద్దరు రైతుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు చెప్పారు.షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని వైద్యులు చెప్పడంతో ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.