Asianet News TeluguAsianet News Telugu

అయ్యన్న, బుద్దా వెంకన్నపై పోలీస్ కేసులు... ఏయే సెక్షన్ల కిందంటే...

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లపై ఆత్కూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాాయి. 

Police case filed on TDP Leaders Ayyannapatrudu Budda Venkanna AKP VJA
Author
First Published Aug 25, 2023, 12:14 PM IST

విజయవాడ : తెలుగుదేశం పార్టీ నేతల బుద్దా వెంకన్న, అయ్యన్నపాత్రుడు లపై పోలీసులు కేసు నమోదు చేసారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఈ ఇద్దరు నాయకులు మాట్లాడారు. వీరి మాటలు చాలా అసభ్యంగా, వైసిపి ప్రజాప్రతినిధులను కించపర్చేలా వున్నాయంటూ మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో వెంకన్న, అయ్యన్నపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. 

గన్నవరం సభలో నారా లోకేష్ తో సహా టిడిపి నాయకులంతా మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశి లపై విరుచుకుపడ్డారు. ఇలా అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి రోజా లను అసభ్య పదజాలంతో దూషించారని పేర్ని నాని ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీంతో అయ్యన్నపై 153a,354A1(iv),504,505(2),509 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసారు. 

ఇక మరో నేత బుద్దా వెంకన్న కూడా పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేసారు. వైసిపి, టిడిపి వర్గాల మధ్య గొడవలు సృష్టిచేలా రెచ్చగొడుతూ వెంకన్న మాట్లాడారని అన్నారు. వైసిపి ప్రజాప్రతినిధులు వంశీ, కొడాలి నాని లపై అసభ్యకరంగా మాట్లాడిన వెంకన్నపై చర్యలు తీసుకోవాలని పేర్ని నాని పోలీసులను కోరారు. దీంతో ఆయనపై 153,153a,505(2),506 సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు. 

Read More  అవనిగడ్డలో వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్.. రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందన్న బుద్దప్రసాద్

ఇదిలావుంటే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఇకపై రెచ్చగొట్టేలా, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయవద్దంటూ పోలీసులు లోకేష్ కు నోటీసులు జారీచేసారు. ఈ నోటీసులు అందించడానికి వెళ్లిన పోలీసులు లోకేష్ ను కలవలేకపోవడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు అందించారు. ఆయన ఈ పోలీస్ నోటీసులను లోకేష్ కు అందించారు.   

మాజీ మంతి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ గుడివాడలో కూడా పోలీసులకు పిర్యాదులు అందాయి. నాని,వంశీ లను గుడ్డలూడదీసి కొట్టిస్తానని అవమానకరంగానే కాదు చంపేస్తాననే విధంగా లోకేష్ మాట్లాడారంటూ గుడివాడ వైసిపి నాయకులు పోలీసులకు పిర్యాదు చేసారు. టిడిపి నాయకులను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేష్ మాటలు వున్నాయని పేర్కొన్నారు. లోకేష్ తో పాటు మరికొందరు టిడిపి నాయకులు కూడా ఇలాగే రెచ్చగొట్టేలా మాట్లాడారని... వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైసిపి నాయకులు కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios