మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు జీతాల వివాదం మరో మలుపు తిరిగింది. ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు తో పాటు 10మంది ఉద్యోగులపై పోలీస్ కేసు నమోదయ్యింది, 

విజయనగరం: మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై విజయనగరం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాన్సాస్ చైర్మన్, కరస్పాండెంట్‌తో సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈవో వెంకటేశ్వరరావు తమ వేతనాలు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ మూడు రోజులక్రితం చైర్మన్ అశోక్ గజపతిరాజు వద్ద తమ ఆవేదనను వెల్లబోసుకున్నారు మాన్సాస్ ఉద్యోగులు. 19 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు. దీంతో అశోక్ గజపతిరాజుతో పాటు ఉద్యోగులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. 

కష్టం వచ్చిందని చెప్పుకునేందుకు వెళ్లిన తమపైన పోలీసులు అన్యాయంగా కేసు బనాయించడం దారుణమని ఉద్యోగులు అంటున్నారు. మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజేపైనా కేసు పెట్టడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

read more మాన్సాస్ ట్రస్ట్‌లో కొత్త వివాదం.. జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు, అశోక్ టార్గెట్‌గా సంచయత ట్వీట్

ఇటీవలే మాన్సాస్ ట్రస్ట్ సిబ్బంది జీతాల సమస్యపై స్పందించారు చైర్మన్ అశోక్ గజపతిరాజు. సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదన్నారు. జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదన్నారు. సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదని స్పష్టం చేశారు.

సిబ్బంది పనిచేసేది జీతాల కోసం.. ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదని హితవు పలికారు. జీతమడిగితే కేసులు పెడతారా? అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. సిబ్బందిని మీరేమి చేయాలనుకుంటున్నారని ఆయన నిలదీశారు. మాన్సాస్ చైర్మన్‌గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదని.... జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా? అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. 

అయితూ ఈ అంశంపై ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సంచయిత చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మీ అన్నగారి పుట్టిన రోజున ఇలా ఉద్యోగులతో ధర్నా చేయించడం సిగ్గుచేటంటూ పరోక్షంగా అశోక్ గజపతి రాజును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు సంచయిత.