పోలీస్ స్టేషన్లో ఏడేళ్ల చిన్నారి నిర్బంధం...ఇది వైసిపి చట్టమేనా?: చంద్రబాబు సీరియస్
ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసులను అడ్డు పెట్టుకుని వైసిపి నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసులను అడ్డు పెట్టుకుని వైసిపి నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పోలీసుల వ్యవహారమే అందుకు నిదర్శనమని... ఓ వైసిపి నేత మాట విని ఏడేళ్ల చిన్నారిని సైతం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి నిర్బంధించడం దారుణమంటూ సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు.
''కొంతమంది పోలీసులు తాము అమలుచేయాల్సిన చట్టాలను వదిలేసి, వైసీపీ నేతల మాటే చట్టం అన్నట్టుగా వ్యవహరించడం దారుణం. వైసీపీనేత ఫిర్యాదు చేసాడని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను 7 ఏళ్ళ చిన్నారితో సహా తెచ్చి చిల్లకల్లు స్టేషన్లో నిర్బంధించారు'' అని చంద్రబాబు తెలిపారు.
''ఆ చిన్నారిలో మీకు ఏ నేరస్థుడు కనిపించాడు. స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్బంధించమని ఏ చట్టంలో ఉంది?తెలుగుదేశం పార్టీ వాళ్ళను కోవిడ్ నిబంధనలంటూ ఇబ్బంది పెట్టే మీకు, ఇలా అందరినీ గుంపుగా ఒక్కచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించింది? కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా?'' అంటూ వైసిపి నాయకులు, ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.