చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన టీడీపీ నేత, మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కుప్పం తీసుకొచ్చారు. 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత నెలలో మూడు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు పోలీసులు దాదాపు 60 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా.. తాజాగా టీడీపీ నేత, మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కుప్పం తీసుకొచ్చారు. 

వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం రాజ్‌కుమార్‌ను కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి రాజ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘర్షణలు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలులో ఉన్నారు.

అయితే కుప్పంలో తమ పార్టీ శ్రేణుల అరెస్ట్‌లను తెలుగుదేశం పార్టీ ఖండించింది. కుప్పంలో అన్న క్యాంటీన్ కూల్చివేతను అడ్డుకున్న తెలుగుదేశం నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించిందని మండిపడింది. ఇక, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చిత్తూరు జిల్లా జైలుకు వెళ్లి టీడీపీ నేతలను కలిసినట్టుగా టీడీపీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.