టిడిపిలో విషాదం... కరోనాతో పోలవరం మాజీ ఎమ్మెల్యే మృతి
ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో పోలవరం టిడిపి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస రావు కరోనాతో మృతిచెందారు.
ఏలూరు: తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ తరపున గతంలో పోలవరం ఎమ్మెల్యేగా పనిచేసిన వంక శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితమే కరోనా బారినపడ్డ ఆయన ఏలూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతిపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
''పోలవరం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు అకాల మరణం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఆయన పోలవరం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి శ్రీనివాసరావు విశేషంగా కృషి చేశారు. పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా'' అంటూ చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.
read more ఆ అమరజవాన్ కుటుంబాన్ని ఆదుకోండి..: సీఎస్ కు చంద్రబాబు లేఖ
కొద్దిరోజుల క్రితమే శ్రీనివాస్ భార్య సత్యవతి కూడా కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. తాజాగా ఆయన కూడా కరోనాతో ఏలూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇలా నెలరోజుల వ్యవధిలోనే భార్యాభర్తలను కరోనా బలితీసుకుంది. మాజీ ఎమ్మెల్యే మరణంతో కుటుంబంలోనే కాదు పోలవరం నియోజకవర్గ పరిధిలో విషాదం నెలకొంది. టిడిపి శ్రేణులు శ్రీనివాసరావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
''తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలవరం మాజీ శాసనసభ్యులు శ్రీ వంకా శ్రీనివాసరావు గారు కరోన బారిన పడి మృతి చెందడం బాధాకరం. వారి మరణం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మశాంతికై భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు.