కాకినాడ  జిల్లా తొండంగి  సెజ్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా  పిఠాపురం మాజీ ఎమ్మెల్యే  వర్మను  పోలీసులు  హౌస్ అరెస్ట్  చేశారు.

కాకినాడ: కాకినాడ జిల్లా తొండంగి సెజ్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పోలీసులు మంగళవారంనాడు అడ్డుకున్నారు. వర్మను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మత్య్సకారులకు మద్దతుగా తొండంగి సెజ్ వద్దకు తాను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ తప్పుబట్టారు. కాకినాడ సెజ్ లో ఏర్పాటు చేసే రసాయన ఫ్యాక్టరీలకు సంబంధించి ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణను కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించనుంది. 

పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలంలోని పొన్నాడు, రమణక్కపేట , తుని నియోజకవర్గంలో తొండంగి మండలంలోని ఏవీ నగరం, తొండంగి రెవెన్యూ గ్రామాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీల ఏర్పాటుకు 4072.63 ఎకరాలు అవసరం.

ఈ ప్రాంతంలో రసయాన పరిశ్రమల ఏర్పాటును మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మత్స్య సంపద దెబ్బతినే అవకాశం ఉందని మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై టీడీపీ నేతలు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. సోమవారంనాడు కాకినాడ కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు.