పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని దారుణంగా చంపి, ముక్కలుగా కోసి, కాల్చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఇది జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పల్నాడు : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఘటనలో ఎన్ని వెలుగులోకి వచ్చినా.. ఆ తర్వాతి పరిణామాలు తెలిసినా.. వాటి బారిన పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా నివారించలేకపోతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో అలాంటి ఓ దారుణమైన ఘటనే వెలుగు చూసింది. ఓ వ్యక్తిని..మరో వ్యక్తి హత్య చేసి.. ముక్కలుగా కోసి తగలబెట్టాడు. 

ఈ ఘటన దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదులు అనే వ్యక్తి గరికపాటి కోటేశ్వరరావు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. వాటిని తగలబెట్టాడు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిశీలించి విచారణ చేపట్టారు. అక్రమ సంబంధాన్ని నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడైన సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు. విచారణలో వెలుగు చూసే అంశాలను బట్టి కేసు ముందుకు సాగుతోందని తెలిపారు.

పల్నాడు దాచేపల్లి నగర పంచాయితీ లో యువకుడి హత్య

ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడికి దక్కుతుందేమో అని అనుమానంతో సొంత స్నేహితుడినే కొట్టి చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు.. నెనావత్ నవీన్ (20) అనే యువకుడు నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్ల నివాసి. అతను నల్గొండలోని ఎంజి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ త్రిబుల్ ఈ ఫోర్త్ ఇయర్స్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరికృష్ణతో ఇతనికి మంచి స్నేహం ఉంది.

వీరిద్దరూ మంచి స్నేహితులే కాకుండా.. ఒకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో వీరి స్నేహం దెబ్బతింది. అమ్మాయి కారణంగా ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన ఉదయం పార్టీ చేసుకుందామని హరికృష్ణ.. తన స్నేహితుడి రూమ్ కి నెనావత్ నవీన్ ను రావాలని ఆహ్వానించాడు. స్నేహితుడి రూమ్ హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. స్నేహితుడి కోరిక మేరకు నవీన్ అక్కడికి చేరుకున్నాడు.

అక్కడ పార్టీలో మరోసారి నవీన్, హరి ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ విషయాన్ని నవీన్ వెంటనే తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి తెలిపాడు. అది ఎక్కడికి దారితీస్తుందో అని భయపడిన శంకరయ్య హరితో ఫోన్లో మాట్లాడి రాజీ కుదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. అయితే, ఆ రోజు నుంచి నాలుగు రోజులైనా కూడా నవీన్ కాలేజీకి కానీ, ఇంటికి కానీ రాలేదు. దీంతో కంగారుపడ్డ అతను తండ్రి శంకరయ్య నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.

శంకరయ్య ఫిర్యాదు మేరకు సీఐ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నార్కట్పల్లి ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా హరి స్నేహితులను, ఎంజీయూలోని విద్యార్థులను ప్రశ్నించారు. ఈ విచారణలో ఈనెల 22 సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని తేలింది. దీంతో హరిక్రిష్ణ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి అడిగారు. అప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న హరి స్నేహితులు, కుటుంబసభ్యులు, పోలీసుల నుంచి తన మీద ఒత్తిడి పెరుగుతుందని గ్రహించి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం లొంగిపోయాడు, 

ఈ మేరకు సమాచారం తెలుస్తోంది. నవీన్ తాను ప్రేమించిన అమ్మాయిని ఎక్కడ దక్కించుకుంటాడోనని... తనకు ఆమె ఎక్కడ దూరం అవుతుందోనని అసూయ చెందానని.. అందుకే అతడిని విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని తెలిపాడు. ఆ తర్వాత నవీన్ మృతదేహాన్ని అబ్దుల్లాపూర్మెట్ శివారులోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి మీద పడేశాడు. ఈ మేరకు హరికృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హరికృష్ణ మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.