పేర్ని నాని: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Perni Nani Biography: పేర్ని నాని.. తన తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టినా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సమయం దొరికితే చాలు.. మీడియా ముందు వాలిపోతారు. టాఫిక్ ఏదైనా.. తన వాక్చతుర్యంతో మంత్రముగ్దులను చేశారు. తన పదునైనా మాటలతో ప్రత్యార్థులను ముప్పు తిప్పలు పెడుతుంటారు. అలాంటి పేర్ని నాని వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..
Perni Nani Biography:
బాల్యం, విద్యాభ్యాసం
పేర్ని నాని అసలు పేరు పేర్ని వెంకటరామయ్య. అది వారి తాత గారి పేరు. అయితే..ఆయనను చిన్ననాటి నుంచి అందరూ ముద్దుగా నాని అని పిలుస్తూ ఉండేవారు. దీంతో అసలు పేరు మరిచిపోయి ముద్దు పేరే అసలు పేరుగా మారింది. పేర్ని నాని 1967లో మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి - నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించారు. నాని చదువు అంతా అక్కడే బందర్లో పూర్తి చేశారు. చదువు అంతగా అవ్వలేదని చెప్పుకునే నాని బీకాం వరకు చదివారు. ఇక నాని భార్య పేరు జయసుధ. ఆమె మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. వీరికి ఒక కుమారుడు కాగా అతని పేరు కృష్ణమూర్తి. నాని తన తండ్రి పేరుని కొడుకు పెట్టుకున్నారు.
కుటుంబ నేపథ్యం
పేర్ని నాని గారిది రాజకీయ కుటుంబం. బందర్ లో వారి కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి మచిలీపట్నం కౌన్సిలర్ గా.. మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ ఛాంబర్.. చైర్మన్ గా పనిచేశారు.ఆ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మర్రి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో సమాచారం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక నాని కుమారుడు కృష్ణమూర్తి. బీటెక్ చేసి హైదరాబాదులో జాబ్ చేసేవాడు. కానీ, ఇప్పుడు తన కుమారుడు కూడా రాజకీయాలకు వచ్చి నాని గారి బాటలోనే నడుస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు.
రాజకీయ ప్రవేశం
పేర్ని నాని రాజకీయ ప్రవేశం తన తండ్రి వారసత్వమేనని చెప్పాలి. ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా సైలెంట్ గా ఉండేవారు. తన తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆరు నుంచి ఏడు నెలల పాటు హాస్పిటల్లోనే ఉండవలసి వచ్చింది. ఈ సమయంలో తన తండ్రి చెప్పే విషయాలను అధికారులకు చెప్పేవారు. అధికారులు చెప్పే విషయాలను తన తండ్రికి చెప్పేవారు. అలాగే తన తండ్రికి ఏమైనా పనులు ఉంటే..ఆయనే స్వయంగా చేసుకునేవారు.
ఆ సమయంలో ప్రజాసేవ మీద కొంత ఆసక్తి కలగడంతో ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఇలా కాంగ్రెస్ లో చేరిన ఆయన 1999లో మొదటిసారి బందరు నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో విజయం పొందలేకపోయారు. 2004లో మళ్లీ బందరు నియోజకవర్గం నుండి పోటీ చేసి.. 31 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇలా తొలిసారి అసెంబ్లీ లో కాలుమోపారు. ఆ తర్వాత 2009లో కూడా ఆయన మళ్లీ బందరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు.
అయితే 2009లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారిపోయాయి. తొలుత రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కాలంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఈ తరుణంలో మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి విషయంలో నల్లారి కిరణ్ కుమార్ కు నానికి కొంత అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కొందరు చెప్తారు.
వైసీపీలో చేరిక
అయితే.. ముందు నుండి వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తో సన్నిహితంగా ఉన్న పేర్ని నాని.. తన పదవీకాలం ముగియకముందే మరో ఏడాదిన్నర ఉందని తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇక అప్పటినుండి జగన్ తో పాటు నాని కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఇక 2014 ఎన్నికలలో పోటీ చేసినా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి భారీ విజయం నమోదు చేయడమే కాక నాని కూడా బందర్ నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. ఆ విధంగా ఆయన మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాకుండా సీఎం జగన్ క్యాబినెట్ లో రవాణా , ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అద్రుష్టాన్ని బందర్ నియోజకవర్గంలో పరీక్షించుకోనున్నారు.