అరకు ఎమ్మెల్యే హత్య చంద్రబాబు తీరు వల్లే: పవన్ సీరియస్ వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీరు వల్లే అరకు ఎమ్మెల్యే హత్య జరిగిందని ఆరోపించారు.
దెందులూరు: సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీరు వల్లే అరకు ఎమ్మెల్యే హత్య జరిగిందని ఆరోపించారు. అరకు పాంత్రంలో అక్రమ మైనింగ్పై ప్రజలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. అందువల్లే మావోయిస్టులు ఎమ్మెల్యేను హత్య చేశారన్నారు.
మరోవైపు స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు. రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబర్దార్ అని సవాల్ విసిరారు.
ప్రభుత్వ విప్ గా ఉంటూ దౌర్జన్యం చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 27 కేసులున్న చింతమనేనిని చట్టసభల్లో కూర్చోబెట్టారని విమర్శించారు. కొల్లేరు భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వుకుంటూ అడ్డువచ్చిన వారిపై దాడులు చేయడం మానుకోవాలని పవన్ హెచ్చరించారు. చింతమనేని ఇన్ని దారుణాలు చేస్తుంటే జిల్లా కలెక్టర్, డీజీపీ, హోంమినిస్టర్, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిన వారిని చట్టసభల్లోకి తీసుకువచ్చి వారిని పెంచిపోషిస్తున్న టీడీపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. చింతమనేని అంటే చంద్రబాబుకి, లోకేశ్కి భయం అందుకే అతనిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
చింతమనేని నీ అరాచకాలు మానుకోకపోతే నేనే దెందులూరు వస్తాను ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరిలో ప్రశాంతత లేకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తిరగబడతామని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని పవన్ వార్నింగ్ ఇచ్చారు.