మీ నాన్న జేబు డబ్బులతో వేశారా: లోకేష్ కు పవన్ కౌంటర్
తమ తండ్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లపై ప్రతిపక్షాల నేతలు నడుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు.
శ్రీకాకుళం: తమ తండ్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లపై ప్రతిపక్షాల నేతలు నడుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో తన పోరాట యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా లోకేష్ చేసిన వ్యాఖ్యను తిప్పికొట్టారు.
మా నాన్నగారు వేసిన రోడ్లపై నడుస్తున్నారని లోకేశ్ అనడం హాస్యస్పదంగా ఉందని ఆయన అన్నారు. "మీనాన్న జేబులో ఉన్న డబ్బులతో రోడ్లు వేశారా?" అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలను అమరావతిలో సన్మానించిందెవరని ఆయన కూడా ఆయన అడిగారు
ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 33 సార్లు మాట తప్పారని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా నేతలకు ఉద్దానం సమస్యలు పట్టడం లేదని ఆయన అన్నారు. .శ్రీకాకుళం ప్రజల కోసం తానున్నానని చెప్పారు.
ఉత్తరాంధ్ర నేతలకు ఇక్కడి ప్రజల సమస్యలు కనిపించడం లేదా అని అటిగారు. ఇతర రాష్ట్రాలు వద్దన్న పరిశ్రమలన్నీ ఏపీకి తరలిస్తారా అని నిలదీశారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా జోరుగా నడుస్తోందని ఆరోపించారు. రేవు దాటాకా తెప్ప తగలేస్తున్నారని, ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు లోకేశ్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.