ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను కీర్తిస్తూ ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను కీర్తిస్తూ ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. ఇటీవల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన పవన్ కల్యాణ్.. మోదీ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. తాను ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ కలిశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, సమస్యలను వివరించడానికి విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. ఈ సమావేశాన్ని సమన్వయం చేసినందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి మోదీ అని అన్నారు. 

‘‘క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని సమాదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారు.ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి ప్రధాని మోదీ. 

‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయి’’ అని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్స్ చేశారు. 

Scroll to load tweet…


ఇదిలా ఉంటే.. ఇటీవల మోదీని కలిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా నేను ప్రధానితో సమావేశమయ్యానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులతోపాటు పలు అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. నా దగ్గర ఉన్న సమాచారాన్ని అతనితో పంచుకున్నాను. ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు తెస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. 

ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీతో పవన్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.