బాబుకు అండగానే పవన్, చిరు ఏం చేశారు: ఆళ్ల నాని
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అండగా నిలబడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ డ్రామాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని దుయ్యబట్టారు.
ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అండగా నిలబడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ డ్రామాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని దుయ్యబట్టారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
భీమవరంలో సమస్యలపై చర్చకు రావాలంటూ జగన్ను సవాల్ చేయడం పవన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. భీమవరంలో నాలుగు రోజులుగా మకాం వేసిన పవన్ ఒక్కసారి కూడా తుందుర్రు ఎందుకు వెళ్లలేదని ఆయన అడిగారు.
తుందుర్రు పోరాట సమితి ఎన్నిసార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా కొంచెం కూడా స్పందించని పవన్కు జగన్ను విమర్శించే అర్హత లేదని అన్నారు. ప్రజల గురించి ఆలోచిస్తారు గనుకే జగన్ తుందుర్రులో పర్యటించారని చెప్పారు. తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టం గురించి ఆయన దృష్టికి రావడంతో అసెంబ్లీలో లేవనెత్తారని గుర్తు చేశారు.
జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు. దమ్ముంటే పవన్ గానీ, జనసేన నాయకులు గానీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెండేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి జిల్లాకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున్నే పోలవరం గురించి పవన్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. అనైతిక రాజకీయాలకు పాల్పడే సంస్కృతి ఉన్నందునే వైస్సార్ సీపీ కుటుంబంలోని మహిళ గురించి జనసేన సైనికులు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీలను కూడగట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటూ ప్రగల్భాలు పలికే పవన్.. ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార చేసినపుడు మాత్రం మొహం చాటేశారని అన్నారు.