పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం: కొండారెడ్డి ఖిల్లా విధ్వంసం
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం: కొండారెడ్డి ఖిల్లా విధ్వంసం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ స్మారకంగా గుర్తింపు పొందిన కర్నూలులోని కొండారెడ్డి ఖిల్లాను వారు విధ్వంసం చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన పవన్ కల్యాణ్ బహిరంగ సభ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
దాదాపు వేయి మంది కొండా రెడ్డి ఖిల్లాలోకి చొరబడ్డారు. జనసేన జెండాలను ప్రదర్శిస్తూ గోడల మీదికి ఎక్కారు. బారికేడ్లను తన్నేశారు.
ఈ సంఘటనలో దాదాపు 200 పూలకుండీలు నాశనమయ్యాయి. స్టీల్ రెయిలింగ్స్ వంగిపోయాయి. మెట్లు, బెంచీలు ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష రూపాయల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో టూటౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది
12వ శతాబ్దికి చెందిన ఆ కట్టడం చాలా బలహీనంగా ఉందని, సున్నితంగా వ్యవహరించకపోతే కూలిపోతుందని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భావిస్తోంది.
పవన్ కల్యాణ్ బహిరంగ సభ కోసం కొండారెడ్డి ఖిల్లాను (ఎఎస్ఐ) అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖిల్లా సమీపంలో పవన్ కల్యాణ్ సభకు ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ స్థలం బహిరంగ సభకు సరైందా, లేదా అని అంచనా వేయడంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆవరణ అంతా నాశనమైందని ఎఎస్ఐ అధికారులు అంటున్నారు. లైట్లు, ట్యూబ్స్ పగులగొట్టారని విమర్శిస్తున్నారు.
సాధారణంగా ఐదుగురు ఉద్యోగులు ఖిల్లా బాగోగులు చూస్తుంటారు. అయితే, పవన్ కల్యాణ్ సమావేశాన్ని దృశ్టిలో పెట్టుకుని మరో పది మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. గుంపును నియంత్రించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు.
ఆశ్చర్యకరంగా పవన్ కల్యాణ్ కొండారెడ్డి ఖిల్లా విశిష్టతను ప్రశంసించారు. ఇటువంటి ఖిల్లా గ్రీసులోనో ఫ్రాన్స్ లోనో ఉంటే ప్రపంచ ప్రసిద్ధి పొందిన వారసత్వ కట్టడంగా విలసిల్లి ఉండేదని అన్నారు.