కరోనా కేసులు ఉధృతి పెరిగిపోతున్న తరుణంలో  ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  విమర్శించారు.

అమరావతి: కరోనా కేసులు ఉధృతి పెరిగిపోతున్న తరుణంలో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్ధులు కరోనా బారినపడ్డారని ఆయన గుర్తు చేశారు. కరోనా సెకండ్ వేవ్ తో వేలాది మంది నిత్యం కరోనాబారినపడుతున్నా కూడ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించాలనుకోవడం పాలకులకు ప్రజల యోగక్షేమాలపై ఏ మాత్రం శ్రద్ద లేదని తేలిందన్నారు. రాష్ట్రంలో 10.5 లక్షల మంది ఇంటర్ విద్యార్ధులు, 6.5 లక్షల మంది టెన్త్ మంది విద్యార్ధులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం వల్ల 36.5 లక్షల మంది కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీబీఎస్ఈ, తెలంగాణ ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని ఆయన ఆ ప్రకటనలో గుర్తు చేశారు.

గత ఏడాది ఏపీ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తామని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.