ప్రజలకు బాకీ ఉన్నట్లు ముఖ్యమంత్రి పత్రాలు రాసివ్వాలి: పవన్
ఆంధ్రప్రదేశ్కు జీవనాడియైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇళ్లు, వాకిళ్లు త్యాగం చేసిన వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్కు జీవనాడియైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇళ్లు, వాకిళ్లు త్యాగం చేసిన వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ రోజు జంగారెడ్డిగూడెంలోని రాజురాణి కల్యాణ మండపంలో పోలవరం భూనిర్వాసితులతో పవన్ సమావేశమయ్యారు.
అనంతరం వారితో మాట్లాడి.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భూనిర్వాసితులకి పరిహారం ఇవ్వకుండా.. వారికి న్యాయం చేయకుండా పోలవరం ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు.
రోడ్ల విస్తరణలో, జాతీయ స్థాయి ప్రాజెక్టుల కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి అంతేస్థాయి జీవితాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతన్నారు....పోలవరం బాధితులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో చాలా మంది భూ నిర్వాసితులున్నారని.. వారు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే.. రైతులకి బాకీ ఉన్నట్లు బాకీ పత్రాలు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
కొన్ని కులాల్ని పట్టించుకుని.. మరి కొన్ని కులాల్ని వదిలేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ముఖ్యమంత్రి ఒక కులానికో.. ఒక ప్రాంతానికో ముఖ్యమంత్రి కాదు.. రాష్ట్రం మొత్తానికి నేత. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించని నేపథ్యంలో... కలిసివచ్చే పార్టీలతో కలిసి... పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని పవన్ హెచ్చరించారు.