తలవంచినట్లు కాదు: కేసీఆర్ తో ముచ్చట్లపై పవన్ కల్యాణ్ క్లారిటీ
తెలంగాణ నాయకులతో మాట్లాడినంత మాత్రాన తాను వాళ్లకి తల వంచినట్లు కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను ఎప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనని చెప్పారు.
గుంటూరు: తాను ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో మాట్లాడిన విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ నాయకులతో మాట్లాడినంత మాత్రాన తాను వాళ్లకి తల వంచినట్లు కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను ఎప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనని చెప్పారు.
తాను ఎవరితోను మాట్లాడినా కూడా పద్ధతిగా మాట్లాడుతానని ఆయన అన్నారు. అందరితోనూ మాట్లాడుతానని, సంస్కారంతో ఉంటానని ఆయన అన్నారు. కేసీఆర్ తో మాట్లాడినా మరెవరితోనూ మాట్లాడినా సంస్కారంతో మాట్లాడుతానని, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనని అన్నారు. తాను రాజ్యాంగబద్దమైన చట్టసభలను, రాజ్యాంగబద్దంగా సంక్రమించిన పదవుల్లో ఉన్నవారిని గౌరవిస్తానని ఆయన అన్నారు.
ఇటీవల హైదరాబాదు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్ తోనూ కేటీఆర్ తోనూ ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ వారితో మాట్లాడడం చర్చనీయంగా మారింది. దీంతో ఆయన ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ నాయకులతో మాట్లాడినంత మాత్రాన నేను వాళ్లకి తలవంచినట్టు కాదు, నేను ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టను . - @PawanKalyanhttps://t.co/yQ4R4cMfFj
— JanaSena Party (@JanaSenaParty) January 29, 2019