ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రేపు పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ కలవనున్నారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేవారి సంఖ్య పెరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇప్పటికే ఆయనను కుటుంబ సభ్యులు కలిశారు. బుధవారం సుప్రీంకోర్ట్ న్యాయవాది, ప్రస్తుతం చంద్రబాబు కేసులు చూస్తున్న సిద్ధార్థ్ లూథ్రా కూడా ఆయనతో ములాఖత్ అయ్యారు. తాజాగా రేపు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఇదే రోజున సినీనటుడు నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌లు కూడా కలవనున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదిలాఉంటే, చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం ఉదయం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తాను గతంలో పీపీగా పనిచేశానని.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తానని చంద్రబాబు లాయర్‌‌ను ప్రశ్నించారు. అయితే ఇందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. 

Also Read:న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు.. : చంద్రబాబు లాయర్ లూథ్రా ఆసక్తికర పోస్టు..

మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో చంద్రబాబు సీఐడీ కస్టడీపై ఈ నెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది