యువతిని మోసం చేసిన పాస్టర్.. అండగా నిలిచిన కరాటే కల్యాణి..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పాస్టర్ పే పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతికి నటి కరాటే కల్యాణి అండగా నిలబడ్డారు. పాస్టర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఆ యువతి ఆరోపించింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పాస్టర్ పే పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతికి నటి కరాటే కల్యాణి అండగా నిలబడ్డారు. పాస్టర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఆ యువతి ఆరోపించింది.
ఈ మేరకు నటి కరాటే కల్యాణి సాయంతో బాధితురాలు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లేది.
అక్కడ పాస్టర్ గా ఉన్న ఎన్జే షరోన్ కుమార్ ఈ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడని బాధిత యువతి ఆరోపణ. ఆ తరువాత పాస్టర్ ముఖం చాటేశాడని, పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీస్తే నగ్న వీడియోలు బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అయితే తనకు తండ్రి లేకపోవడంతో పాస్టర్ బెదిరింపులకు భయపడి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు యువతి పేర్కొంది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసిందని చెప్పుకొచ్చారు.
యువతికి జరిగిన అన్యాయం తెలుసుకుని, తనకు ధైర్యం చెప్పి నేరుగా రాజమహేంద్రవరం తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా తాను అండగా ఉంటామని తెలిపారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోషి తెలిపారు.