వాళ్ల నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి రూ. 15 కోట్లు డిమాండ్ చేశారు: పరిటాల సునీత
ఏపీలో వైసీపీ నేతల వేధింపులతో పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పరిటాల సునీత (Paritala Sunitha) విమర్శించారు. అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై (Topudurthi Prakash Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై (Topudurthi Prakash Reddy) మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పరిటాల సునీత (Paritala Sunitha) సంచలన ఆరోపణలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతం నుంచి జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే కారణమని ఆరోపించారు. జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పరిటాల సునీత బుధవారం పాదయాత్ర చేపట్టారు. జాకీ పరిశ్రమ ఏర్పాటు స్థలం నుంచి రాప్తాడు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ నేతల వేధింపులతో పరిశ్రమలు పారిపోతున్నాయని ఆరోపించారు. ఉపాధి కల్పించడం చేతకాని వైసీపీ నేతలు.. ఉన్న పరిశ్రమలను వెళ్లగొడితే యువత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ తరలివెళ్లడానికి ప్రకాష్ రెడ్డి కారణమన్న సునీత.. పరిశ్రమ యజమాన్యం నుంచి ఆయన రూ. 15 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. జాకీ పరిశ్రమ వచ్చి ఉంటే రాప్తాడు కలకలలాడేదని.. 6 వేల మందికి ఉపాధి కలిగి ఉండేందని చెప్పారు.
కానీ.. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. వైసీపీ నాయకుల తీరు వల్లే జాకీ పరిశ్రమ ఇక్కడి నుంచి తరలివెళ్లిపోయిందన్నారు. అసలు నిజాలను దాచిపెట్టి.. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జాకీ వెళ్ళిపోయిందనే వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 2017లో టీడీపీ హయాంలో జాకీ పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా అయినప్పటీ నుంచి ప్రజలను వేధిస్తున్నారని.. ఆస్తులను లాక్కుంటున్నారని ఆరపించారు.