ఆ విషయంలో గిన్నిస్ రికార్డ్, ఆస్కార్ అవార్డ్ రెండూ జగన్ కే..: టిడిపి అనురాధ ఎద్దేవా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పచ్చి అబద్దాల కోరుగా గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కడమే కాదు ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకోగలడని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేసారు.
అమరావతి: దేశంలోని రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాలకోరుగా జగన్ రెడ్డి గిన్నిస్ రికార్దులకెక్కుతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. వైసిపి నాయకుల అబద్దాలకు ఆస్కార్ అవార్డులు కూడా ఇవ్వొచ్చని ఆమె ఎద్దేవా చేసారు. విద్వంకకారుడైన జగన్ రెడ్డి తానే సామాజిక న్యాయం చేసి బడుగు బలహీన వర్గాలను ఉద్దరించినట్టు పచ్చి అబద్దాలు చెబుతున్నారని... కానీ ఆయన చేసింది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహమని అనురాధ అన్నారు.
''పల్నాడు జిల్లాలో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు వైసీపీ రౌడీమూకల చేతిలో హత్య గావించబడితే నిందితుల్లో ఒక్కరిపై అయినా చర్యలు తీసుకున్నారా? సామాజిక న్యాయం అంటే ఇదేనా? దారుణంగా హత్యగావించబడ్డ బీసీ నేత జాలయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే లోకేశ్ ని అడ్డుకునేందకు ప్రయత్నించటం దారుణం. లోకేశ్ అంటే వైసీపీకి ఎందుకంత భయం'' అని అనురాధ ప్రశ్నించారు.
''వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న అరాచకాలు భయటపడకూడదని లోకేశ్ పర్యటనను అడ్డుకుంటారా? హత్యకు గురైన బాధిత కుటంబసభ్యులు ఆ హత్యల వెనుక పిన్నెల్లి హస్తం ఉందని చెబుతున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పల్నాడులో మారణ హోమం సృష్టిస్తున్న పిన్నెల్లిపై చర్యలు తీసుకోకపోగా బాధిత కుటుంబ పరామర్శకు వెళ్తున్న లోకేశ్ పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు చేత నోటీసులిప్పిస్తారా? పరామర్శకు వెళ్తున్న వారికి మీ వల్ల అల్లర్లు జరిగి ప్రాణం నష్టం జరుగుతుందని, విద్వంసకర పరిస్ధిలు ఏర్పడి ఆస్తుల విద్వంసం జరుగుందని నోటీసులివ్వటానికి పోలీసులకు బుద్ది ఉందా? పోలీసులు తమ నెత్తిపై ఉన్న 3 సింహాలకు విలువనిచ్చి 3 ఏళ్లు అయినట్టుంది. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోగా జగన్ రెడ్డికి తొత్తులు వ్యవహరించటం దారుణం'' అని మండిపడ్డారు.
''బీసీలకు మంత్రి పదవులిచ్చామని జగన్ అంటున్నారు కానీ వారి అధికారమంతా తన సామంతరాజులైన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలకు కట్టబెట్టారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? టీడీపీ బీసీలకు స్దానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాంట్లో 10 శాతం కోత విధించి 16,800 మందికి రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా? సామాజిక ద్రోహమా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి'' అని అనురాధ నిలదీసారు.
''3 ఏళ్ల పాలనలో సబ్ ప్లాన్ నిధులు సహా బీసీలకు చెందిన రూ. 26 వేల కోట్లు దారిమళ్లించటం సామాజిక న్యాయమా? సామాజిక ద్రోహమా? తమ తాతల తరం నుంచి బడుగు బలహీన వర్గాలు సాగు చేసుకుంటున్న 11 వేల ఎకరాలు అసైండ్ భూములు లాక్కుని వారిని రోడ్డున పడేయటం సామాజిక న్యాయమా? బడుగు బలహీన వర్గాల విద్యార్దులు విదేశాల్లో చదువుకునేందుకు చంద్రబాబు నాయుడు రూ. 10 లక్షలిచ్చారు. కానీ జగన్ రెడ్డి మాత్రం బీసీలకు విదేశాలంటే ఏంటో తెలియకూడదన్న కుట్రతో ఆ పథకాన్ని రద్దు చేశారు. గురుకుల పాఠశాలల్ని నిర్వీర్యం చేసి బీసీ విద్యార్దులకు ద్రోహం చేయటం సామాజిక న్యాయమా? కళ్లు గీత కార్మికుల్ని వేధించటం సామాజిక న్యాయమా?'' అని ప్రశ్నించారు.
''చేనేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సీడీలు లేకుండా చేశారు? బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 15 సంక్షేమ పథకాలు జగన్ రెడ్డి రద్దు చేసి ద్రోహం చేశారు. ఇదేనా జగన్ రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం?'' అని అడిగారు.
''మరోవైపు బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తల్ని జగన్ రెడ్డి పొట్టనపెట్టకుంటున్నారు. అధికార మదంతో బడుగు బలహీన వర్గాల హక్కుల్ని కాలరాస్తున్నారు. జగన్ రెడ్డి చేసేది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు బ్రతికే స్వేచ్చ ఉంటుంది'' అన్నారు.
''వైసీపీ మారు పేర్లు విద్వంస పార్టీ, చెంచల్ గూడ జైలు పార్టీ. టీడీపీ మారు పేరు బడుగు బలహీన వర్గాల పార్టీ, మహిళల పార్టీ. ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోవటం ఖాయం. జగన్ రెడ్డి ఇకనైనా అబద్దాలు చెప్పటం మానుకోవాలి'' అని పంచుమర్తి అనురాధ హితవు పలికారు.