పవన్ ఫ్లెక్సీల తొలగింపు.. ఉద్రిక్తత.. తొక్కిసలాట
అయితే పవన్ గ్రామంలో ఉన్న సమయంలో ఫ్లెక్సీలను తొలగించడం ఏమిటంటూ పంచాయతీ సిబ్బందితో జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన రాకను పురస్కరించుకొని ఆయన అభిమానులు స్వాగతాలు పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా.. ఈ ఫ్లెక్సీల విషయంలో జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.
భీమవరం చినఅమిరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ చినఅమిరం వచ్చారు. అయితే పవన్ గ్రామంలో ఉన్న సమయంలో ఫ్లెక్సీలను తొలగించడం ఏమిటంటూ పంచాయతీ సిబ్బందితో జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కబరిచారు. బ్యానర్లు తొలగించినవారిపై చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. మరోవైపు పవన్ బస చేసిన ఫంక్షన్ హాలు వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఓ అభిమానికి తీవ్ర గాయాలు అయ్యాయి.