పంచాయితీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం... ఆ ఐఎఎస్ లు బదిలీ
ఆంధ్ర ప్రదేశ్ లో పలువురు ఐఎఎస్ ల బదిలీలు జరిగాయి.
అమరావతి: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలను చేపట్టింది. బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంత రామును, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ సిఎస్(జీపీఎం అండ్ ఏఆర్)గా ప్రవీణ్ కుమార్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ నియమించారు. అలాగే జయలక్ష్మికి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదిలావుంటే ఏపీలో ఎన్నికల సంఘానికి-రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. సీనియర్ ఐఎఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు.
గత నెల 27వ తేదీన ఏపీ ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ఈ ఇద్దరు కీలక అధికారులు గైర్హాజరయ్యారు. ఆన్ లైన్ నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని గతంలో ఆదేశాలు జారీ చేసినా కూడ పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తున్న కీలక అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఈసీ గుర్రుగా ఉన్నారు., దీంతో ఇవాళ ఈ ఇద్దరు అధికారులను తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు.
ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఈ ఇద్దరు ఐఎఎస్ అధికారుల తీరుపై ఎన్నికల సంఘం గుర్రుగా ఉంది. పంచాయితీ రాజ్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఈ ఇధ్దరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్ఈసీ భావిస్తోంది. ప్రభుత్వం తరపున ఈ ఇద్దరు అధికారులు ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు. ఎన్నికల ప్రక్రియలో ఈ ఇద్దరు అధికారులు వ్యవహరించడం లేదని ఎస్ఈసీ భావిస్తోంది.