టిడిపి ప్రజా ప్రతినిధులపై సభాహక్కుల నోటీసు: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
సభా హక్కుల ఉల్లంఘన నోటీసును జారీ చేసిన బుగ్గన
అమరావతి: తన ప్రతిష్టకు భంగం కల్గించారనే నెపంతో టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్రపై పీఏసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
తనపై టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. వైసీపీకి బిజెపితో సంబంధాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. టిడిపి చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
టిడిపి చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవితో పాటు పీఏసీ ఛైర్మెన్ పదవిని కూడ వదులుకొనేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. తన సవాల్ ను స్వీకరించాలని ఆయన టిడిపి నేతలను కోరారు. ఈ మేరకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల ప్రతిని అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్టు ఆయన చెప్పారు.