పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఓటీఎస్ - ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
ఓటీెఎస్ విధానంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిందని చెప్పారు.
పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఓటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటీఎస్ పై మాజీ సీఎం చంద్రబాబు నాయడు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయడు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీలాగా వైసీపీ ప్రజలను మోసం చేయదని అన్నారు. తాను ఎక్కడా అబద్దాలు మాట్లాడలేదని తెలిపారు. ఈ విషయంలో ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడితో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల టీడీపీ లోకి తీసుకొని వారికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. దీనిని గమనించిన ప్రజలు అందుకే టీడీపీని కొన్ని స్థానాలకే పరిమితం చేసి, శాసన సభలో కూర్చపెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని అన్నారు. విజయనగరం జిల్లాపై ప్రజలపై ఆయన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తమ జిల్లా ప్రజలంతా ఉత్తములని, సౌమ్యులని అన్నారు.
ఓటీఎస్ బలవంతం కాదు..
ఓటీఎస్ అనేది బలవంతం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్వతహాగా ముందుకు వచ్చే వారికి మాత్రమే ఓటీఎస్ అమలు చేస్తానమి స్పష్టం చేశారు. పేదవారికి స్వంత ఇళ్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. చంద్రబాబు హాయంలో ఇది ఎందుకు చేయలేకపోరని ప్రశ్నించారు. పేదవారి కష్టం, బాధ చంద్రబాబు నాయుడుకి తెలియదని ఆరోపించారు. ధనవంతులు, పెద్దవారి గురించే పట్టించుకుంటారని విమర్శించారు. కాల్ మనీ అంశం టీడీపీ హయాంలోనే జరిగిందని ఆరోపించారు. ఇందులో ఆ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారని ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఈ అంశలన్నీ గమనించే ప్రజలు టీడీపీకి 23 స్థానాలు అందించారని అన్నారు. ఓటీఎస్ బ్రోచర్లపై వైసీపీ రంగు ఉందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, తన హయంలో ఎన్నింటిని పసుపు రంగులో ముద్రించారో అందరికీ తెలుసని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఆపడం చంద్రబాబు నాయకుడికి అలవాటే అని ఆరోపించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్లు ఇచ్చారని, రెండు రూపాలయికే కిలో బియ్యం ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలెవరూ మర్చిపోలేదని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్ చేసినవి తాము గొప్పగా చెప్పుకుంటామని చెప్పారు. మురికి కూపంలో ఉంటున్న గ్రామాలు, పట్టణాలు మంచి వాతావరణంలోకి రావాలని ఇందిరమ్మ గృహ పథకాన్ని తీసుకొచ్చి సుమారు 26 లక్షల ఇళ్లను రెండు సంవత్సరాల్లో కట్టించారని తెలిపారు. ఆ సమయంలో తాను మంత్రిగా ఉన్నానని గుర్తు చేశారు. రాష్ట్రానికి కరెంటు తీసుకొచ్చారని, ఆరోగ్య శ్రీ వంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లలో దానిని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. వైఎస్ఆర్ ఆశయాలతో పుట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ మళ్లీ గాడిలో పెట్టారని తెలిపారు. మరెన్నో వ్యాధులను అందులో చేర్చారని చెప్పారు. టీడీపీ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని అన్నారు.