పల్నాడులో ఘోరం ... 50 మందితో వెళుతున్న ట్రావెల్స్ బస్సు-లారీ ఢీ
హైదరాబాద్ నుండి ఒంగోలు వెళుతున్న ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.
పల్నాడు : 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటన పల్నాడు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నుండి శనివారం రాత్రి ఒంగోలుకు 50 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్ బస్సు ఒంగోలుకు బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజాముకు ఈ బస్సు పల్నాడు జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో దాచేపల్లి సమీపానికి రాగానే బస్సు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది.
ఈ బస్సు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా ప్రయాణికులంతా చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. లారీతో పాటు బస్సు ముందుబాగం బాగా దెబ్బతిన్నాయి.
Read More మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి.. ఇంటిముందు పడేసిన దుండగులు.. దాంతోపాటు నగదు, ఉత్తరం....
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ముందుగా గాయపడిన వారిని అంబులెన్స్ లో గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించి సమయానికి చికిత్స అందేలా చూసారు. అనంతరం మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
లారీని ఢీకొట్టిన బస్సు రోడ్డు పైనే ఆగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు బస్సుతో పాటు లారీని పక్కకు జరిపించి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. ఇక ఈ ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే మృతిచెందిన వ్యక్తి వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.