వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా అనుచరుడి కారు అర్థరాత్రి విజయవాడలో బీభత్సం సృష్టించింది. 

విజయవాడ : అధికార వైసిపి ఎమ్మెల్సీ స్టిక్కర్ తో కూడిన కారు విజయవాడలో బీభత్సం సృష్టించింది. ఎమ్మెల్సీ స్టిక్కర్ కలిగిన కారు శనివారం అర్థరాత్రి బీఆర్టిఎస్ రోడ్డులో వేగంగా వెళుతూ ఓ ర్యాపిడో బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా ప్రధాన అనుచరుడు జమీర్ శనివారం ఎమ్మెల్సీ స్టిక్కర్ కలిగిన కారులో బయటకు వచ్చాడు. విజయవాడ బిఆర్టిఎస్ రోడ్డులో అర్థరాత్రి 2గంటల సమయంలో వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ముందుకు దూసుకెళ్ళి ర్యాపిడో బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న లక్ష్మణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదం జరిగిన వెంటనే కారు కూడా ఆగిపోవడంతో ఎమ్మెల్సీ రుహుల్లా అనుచరులు కంగారుపడిపోయారు. కారుకు వున్న ఎమ్మెల్సీ స్టిక్కర్ తొలగించి జమీర్ సహా మిగతవారు ఘటనాస్థలి నుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం లక్ష్మణ్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Read More మంత్రి రోజాకు అస్వస్థత... అర్థరాత్రి హుటాహుటిన అపోలోకు తరలింపు కుటుంబం

ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసమవగా కారు ముందుభాగం దెబ్బతింది. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గుణదల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని... కారు ఎవరిదో తెలుసుకుని ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

అయితే ప్రమాదానికి కారణమైన కారు తనది కాదని ఎమ్మెల్సీ రుహుల్లా చెబుతున్నారు. అసలు ప్రమాదం జరిగిన విషయం కూడా తనకు తెలియదని ఆయన అంటున్నారు. కారు తనదేనని పోలీసుల విచారణలో తేలితే ఏ యాక్షన్ తీసుకున్నా సిద్దమేనని ఎమ్మెల్సీ రుహుల్లా అన్నారు.