AP Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. పార్లమెంట్ వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంగళవారం నాడు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
AP Special Category Status : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మరో సారి కీలక ప్రకటన చేసింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశమని స్పష్టం చేసిన కేంద్రం.. తాజాగా మరోమారు ‘ఏపీకి ప్రత్యేక హోదా పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు.. వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాకు బదులుగా ఏఏ రకాల సాయాలను అందించామన్న విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది.
14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను సిఫారసు చేయలేదని తెలిపిన నిత్యానందరాయ్.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. విభజన చట్టంలోని చాలా హామీలను ఇప్పటికే నెరవేర్చామని కూడా ఆయన చెప్పారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని నాడు కేంద్రం తేల్చి చెప్పింది. తాజాగా వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కూడా అదే తీరులో సమాధానం చెప్పిన కేంద్రం.. ప్రత్యేక హోదాకు బదులుగా ఏఏ రకాల సాయాలను అందించామన్న విషయాన్ని ప్రస్తావించింది.
ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ గానే మారింది. ఈ తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా రాకపోవడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణం అని వైసీపీ నేతలు విమర్శల దాడికి దిగారు. చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపణలు గుప్పించారు.
దీంతో టీడీపీనేతలు ఎదురు దాడికి దిగ్గారు. సీఎం జగన్ తనపై ఉన్న కేసుల భయంతోనే పోలవరం ప్రాజెక్ట్ ని, ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారని విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా, పోలవరం సాధిస్తానని హామీలిచ్చినట్టు నిలదీస్తున్నారు. టీడీపీ హయాంలో కేంద్రం ఆమోదించిన రూ.55,548 కోట్ల ప్రాజెక్టు అంచనాలను ఆమోదింపజేసుకొని, నిధులు తెచ్చుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు.. బీజేపీని టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. సంజీవిని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని మండిపడ్డారు.
